చేజారిన ఉమెన్స్ ఆసియా కప్.. భారత్‌పై శ్రీలంక విజయం

శ్రీలంక అమ్మాయిల జట్టు తొలిసారి మహిళల క్రికెట్ ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీలంక అమ్మాయిలు చెలరేగి ఆడారు. 

భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వారు 18.4 ఓవర్లలోనే ఛేదించారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా టార్గెట్ ఫినిష్ చేశారు. కెప్టెన్ చమరి, హర్షిత సమరవిక్రమ అర్ధ సెంచరీలతో రాణించి లంక విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ అమ్మాయిలు పేలవమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను దూరం చేసుకున్నారు.

భారత బౌలర్లు కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో రాణించలేకపోయారు. దీప్తి శర్మ మాత్రమే ఒక వికెట్ తీసింది. అందరూ భారీగా పరుగులు సమర్పించారు. మరోవైపు ఫీల్డింగ్ తప్పిదాలు కూడా భారత్‌ను దెబ్బకొట్టాయి.

కాగా భారత అమ్మాయిలు ఉమెన్స్ ఆసియా కప్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోవడం ఇదే తొలిసారి. భారత్ ఇప్పటివరకు ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మహిళల ఆసియా కప్‌ ఫైనల్స్‌లో భారత్ చేతిలో శ్రీలంక ఐదుసార్లు ఓటమి పాలైంది. వన్డే ఫార్మాట్‌లో నాలుగుసార్లు, టీ20ల్లో ఒకసారి రన్నరప్‌గా ఆ జట్టు సరిపెట్టుకుంది.

Womens Asia Cup
Indai Womens Vs Sri lanka Womens
Cricket

More Telugu News